అమరావతిలో క్వాంటం-సెక్యూర్ టెస్ట్ బెడ్.. దేశంలోనే తొలిసారి

  • ఎస్ఆర్‌ఎమ్ యూనివర్సిటీ వేదికగా పరిశోధనలు
  • సైబర్ రక్షణ పరిష్కారాలకు కేంద్రంగా అమరావతి
  • మేకిన్‌ ఇండియా సాంకేతికతలకు ఈ ప్రాజెక్టుతో ఊతం
దేశంలోనే తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ సరికొత్త ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాలు వెల్లడించారు.

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన సి-డాట్, అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. అమరావతిలోని ఎస్ఆర్‌ఎమ్ యూనివర్సిటీలో ఈ టెస్ట్ బెడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్లకు అమరావతి ఇకపై కేంద్ర బిందువుగా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

సురక్షితమైన సమాచార మార్పిడి, నమ్మకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఏప్రిల్ 14న క్వాంటం కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభమైనప్పటి నుంచి ఏపీలో కీలక అడుగులు పడుతున్నాయి. టెలికమ్యూనికేషన్, ఐటీ, క్వాంటం రంగాల్లో అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఈ కొత్త టెస్ట్ బెడ్ క్వాంటం కమ్యూనికేషన్ హార్డ్‌వేర్, ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీల పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడనుంది. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీలకు ఊతం లభించడంతో పాటు అమరావతికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుంది. డీప్-టెక్ ఆవిష్కరణలకు ఏపీ రాజధాని కీలక కేంద్రంగా మారబోతోంది.

ప్రపంచ భవిష్యత్తును మార్చే సాంకేతికతలను రూపొందించడంలో ఏపీ విద్యార్థులు, స్టార్టప్‌లు భాగస్వాములు కావడానికి ఇది మంచి అవకాశమని చంద్రబాబు అన్నారు. ఈ అద్భుతమైన ప్రాజెక్టు కోసం శ్రమిస్తున్న సంస్థలకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగస్వాములైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, యువ ఆవిష్కర్తలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Chandrababu Naidu
Amaravati
Quantum secure communications
Quantum testbed
SRM University
C-DOT
Andhra Pradesh
Cyber defense
Quantum computing
Make in India

More Telugu News